పాటియాల, ఫిబ్రవరి 27: కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కోసం కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్లో ఉద్యమిస్తున్న మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. పాటియాల జిల్లా అర్నో ఖుర్ద్ గ్రామానికి చెందిన కర్నైల్ సింగ్(64) బీకేయూ క్రాంతికారి రైతు సంఘానికి జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఆయనకు రూ.7 లక్షల అప్పు ఉన్నదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యమంలో చనిపోయిన మరో రైతు దిన కర్మలకు వెళ్లాలనుకొన్న కర్నైల్ అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయారన్నారు. సోమవారం శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆయనను దవాఖానకు తరలించగా మంగళవారం చనిపోయారని వెల్లడించారు. కర్నైల్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.