కోల్కతా : పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కుంభకోణంలో బెంగాల్ మంత్రి పార్ధా ఛటర్జీని అరెస్ట్ చేయగా, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని నిర్బంధించారు. ఇదే కేసులో కజి నజ్రుల్ యూనివర్సిటీకి చెందిన బంగ్లా ప్రొఫెసర్, మంత్రి మరో సన్నిహితురాలు మొనాలిసా దాస్ పాత్రపైనా ఈడీ ఆరా తీస్తోందని సమాచారం. మొనాలిసా పేరున 10 ఫ్లాట్లు ఉన్నాయని, ఆమె కూడా ఈడీ నిఘా నేత్రంలో ఉన్నదని బీజేపీ నేత దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.
ఈమె కూడా బంగ్లాదేశీయేనని చెప్పారు. ఇక అంతకుముందు పశ్చిమబెంగాల్ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి సన్నిహితురాలి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. మంత్రి పార్థా ఛటర్జి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడిచేశారు. సోదాల్లో ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.500, రూ.2000 నోట్ల కట్టలను గుట్టలుగా పోశారు. ఇదంతా రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. వీటితోపాటు 20 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీతోపాటు, విద్యాశాఖ మంత్రి ప్రరేశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఈడీ ఏక కాలంలో దాడులు నిర్వహించింది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన పీకే. బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.