భోపాల్ : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మరణించింది. దక్షిణాఫ్రికా నుంచి తరలించిన ఆడ చిరుత (cheetah ) దక్ష పార్క్ లోపల ఇతర చీతాలతో పోరాడుతూ మృత్యువాతన పడింది. వాయు, అగ్నిగా పిలిచే ఇతర చీతాలతో తలపడుతూ దక్ష మరణించిందని పార్క్ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్లో ఉంచగా దక్ష మృతితో ఇప్పటివరకూ మూడు చిరుతలు మరణించాయి.
గత ఏడాదిగా నేషనల్ పార్క్కు 20 చిరుతలను తీసుకురాగా మార్చి, ఏప్రిల్లో రెండు చిరుతలు మరణించాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చిరుత సషా ఈ ఏడాది మార్చిలో మరణించింది. భారత్కు తీసుకువచ్చినప్పటి నుంచి సషా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇక నేషనల్ పార్క్లో అస్వస్ధతకు లోనైన మరో చిరుత ఈ ఏడాది ఏప్రిల్లో చికిత్స పొందుతూ మరణించింది.
కాగా నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాలను గత ఏడాది సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్క్లోని స్పెషల్ ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను దేశంలోకి భారత్ స్వాగతించింది. కునో నేషనల్ పార్క్కు తరలించేందుకు ముందు చిరుతల రెండవ బ్యాచ్ గ్వాలియర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండయ్యాయి.
Read More