బెంగళూరు: వివాహేతర సంబంధాన్ని కొనసాగించని సహోద్యోగినిపై ఒక ఉపాధ్యాయుడు ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. విద్యార్థి అయిన ఆమె కుమారుడ్ని దారుణంగా కొట్టి స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసి హత్య చేశాడు. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది. గడగ్ జిల్లాకు చెందిన ఒక స్కూల్లో 32 ఏళ్ల ముత్తప్ప కాంట్రాక్ట్ టీచర్గా పని చేస్తున్నాడు. అదే స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయురాలైన 34 ఏళ్ల గీతతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, గీత ఇటీవల మరో ఉపాధ్యాయుడితో చనువుగా ఉండటాన్ని గమనించిన ముత్తప్ప ఆమెను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడితో సంబంధాన్ని ఆమె విరమించుకుంది. దీంతో గీతపై ప్రతీకారం తీర్చుకోవాలని ముత్తప్ప భావించాడు. సోమవారం ఉదయం ఆమె కుమారుడైన 4వ తరగతి విద్యార్థి భరత్ను క్లాస్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చాడు. ఆ పదేళ్ల బాలుడి తలను గోడకు పదేపదే బాది దారుణంగా కొట్టాడు. అనంతరం భారత్ రెండు కాళ్లు పట్టుకుని స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందకు పడేశాడు.
మరోవైపు అరుపులు విన్న గీత తన క్లాస్ నుంచి బయటకు వచ్చి కుమారుడ్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ముత్తప్ప ఆమె తలను కూడా గోడకేసి బాదాడు. అనంతరం స్కూల్ నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి భరత్ను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. తలకు గాయాలైన గీత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గడగ్ నుంచి పారిపోతున్న ముత్తప్పను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.