హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదంటూ చురకలంటించారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు, ఒడిశా, జార్ఖండ్, ఏపీ ముఖ్యమంత్రులకు గురువారం ఫోన్ చేశారు.
సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశం అనంతరం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
‘‘ఈ రోజు గౌరవనీయులైన ప్రధాని నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నదే మాట్లాడారు. కరోనా కట్టడికి ఏం చేయాలో చెప్పి మా విషయాలు కూడా వింటే బాగుండేది’’ అని సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు.
‘‘ప్రియమైన హేమంత్ సోరెన్, మీరంటే నాకు చాలా గౌరవం.. ఓ సోదరుడిలా మీకు అభ్యర్థిస్తున్నా.. మన మధ్య ఎన్ని విబేధాలున్నా.. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు జాతిని బలహీనపరుస్తాయి. ఇతరులపై వెలెత్తి చూపే సమయం ఇది కాదు. కొవిడ్పై జరుగుతున్న పోరులో అందరం కలిసికట్టుగా ప్రధానికి మద్దతుగా నిలవాలి’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.