Maharastra Navnirman Sena | సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే భేషరతుగా మద్దతు ఇస్తున్నామని, మహా కూటమికి కాదని ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి శాలినీ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ-శివసేన (షిండే)- ఎన్సీపీ (అజిత్ పవార్) సారధ్యంలోని మహా కూటమి తరఫున పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోమని తేల్చి చెప్పారు.
దేశంలో సమర్థ నాయకత్వం కోసం ప్రధాని మోదీకి మాత్రమే మద్దతు ఇస్తున్నామని శాలినీ ఠాక్రే పేర్కొన్నారు. కానీ సంజయ్ నిరుపమ్, రవీంద్ర వైఖర్ వంటి నాయకులకు మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ‘ధనుష్యబాణ్’ చిహ్నంపై ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నేతలకు మద్దతు ఇవ్వమని ఎంఎన్ఎస్ను కోరడం సిగ్గుచేటని ఆమె ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ద్రోహి సంజయ్ నిరుపమ్, అవినీతి పరుడైన రవీంద్ర వైకర్ వంటి నేతలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. గుడిపడ్వా సందర్భంగా ఇటీవల జరిగిన సమావేశంలో ఎంఎన్ఎస్ వ్యవస్థాపక అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ దేశానికి సమర్థ నాయకుడి కోసమే ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.