న్యూఢిల్లీ, మార్చి 17: తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వదిలేశారు. గత ఏడాదే బోస్టన్ యూనివర్సిటీలో చేరిన అభిజిత్ తన క్లాస్మేట్లతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
యథాప్రకారం వారితో యూనివర్సిటీకి వెళ్లిన అభిజిత్ తిరిగి రాకపోడంతో అతని రూమ్మేట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక అడవి సమీపంలో వదిలేసిన కారులో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. హత్యకు గల కారణం వెల్లడి కాలేదు. అభిజిత్ దగ్గర ఉన్న డబ్బు, ల్యాప్టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అతని మరణం గురించి తెలిసి బంధువులు తీవ్రంగా రోదిస్తున్నారు. అతని మృతదేహాన్ని భారత్కు పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.