Meitei Community | న్యూఢిల్లీ, జూలై 23: సెవన్ సిస్టర్స్ అని ముద్దుగా పిలుచుకొనే భారత్లోని ఈశాన్య రాష్ర్టాలు కనీవినీ ఎరుగని కల్లోలంలోకి జారుకొంటున్నాయి. మణిపూర్లో రెండున్నర నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు క్రమంగా ఈశాన్య భారతదేశమంతా పాకుతున్నాయి. మణిపూర్లో కుకీ గిరిజన తెగపై జరుగుతున్న దారుణాలు దిగ్భ్రాంతి గొలుపుతుండటంతో నాగాలాండ్, అస్సాం, మిజోరం వంటి రాష్ర్టాల్లో మైతీలపై ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. ఆ రాష్ర్టాల్లో పరిస్థితి రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నదని, అది ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదమున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని శాంతి కోసం కచ్చితమైన చర్యలు చేపట్టకుంటే జాతుల ఘర్షణ మహా ఉప్పెనలా ఎగిసిపడే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
మణిపూర్లో మెజారిటీలైన మైతీలను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తెల్లారి నుంచి జాతుల ఘర్షణ మొదలైంది. ముఖ్యంగా కుకీ గిరిజనులపై మైతీలు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. కుకీల ఆస్తులను దోచుకొంటున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవల వైరల్ కావటంతో పొరుగు రాష్ర్టాల్లోని ఇతర తెగల యువత మైతీలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నది. దీంతో నాగాలాండ్, మిజోరంలోని మైతీలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఎవరు దాడి చేస్తారోనన్న భయంతో ఆ రాష్ర్టాలను వదిలి మణిపూర్కు వలసపోతున్నారు. ముఖ్యంగా మిజోరం నుంచి మైతీల వలస భారీగా ఉన్నదని వార్తలు వెలువడుతున్నాయి.
మిజోరంలో జో లేదా కుకీ గిరిజనులు అధిక సంఖ్యలో ఉంటారు. నాగాలాండ్లో నాగాలదే మెజారిటీ. ఈ రెండు రాష్ర్టాల్లో కొద్దిమొత్తంలో మైతీలు కూడా ఉంటారు. దీంతో ఏ రాష్ట్రంలో జాతుల ఘర్షణ తలెత్తినా అది పొరుగు రాష్ట్రంలో అలజడికి కారణమవుతుంది. గతంలోనూ అనేకసార్లు ఇలాగే జరిగింది. పొరుగు రాష్ర్టాల్లోని నాగాలు నివసించే ప్రాంతాలను కలిపి బృహత్ నాగాలాండ్ను ఏర్పాటుచేయాలన్న డిమాండ్తో రెండు, మూడు దశాబ్దాలపాటు నాగాలు మిలిటెంట్ పోరాటాలు చేశారు. ఆ సమయంలో తెగల మధ్య భారీగా హింస చోటుచేసుకొన్నది. ఇప్పటికీ నాగాలంటే కుకీలకు, కుకీలంటే మైతీలకు, మైతీలంటే నాగాలకు అస్సలు పడదు. కానీ, తాజా మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. మైతీలపై పోరుకు నాగాలు, కుకీలు ఒక్కటవుతున్నారు. దీంతో ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయోనన్న భయాందోళన నెలకొన్నది. ఇంత జరుగుతున్నా కేంద్రప్రభుత్వంగానీ, ఈశాన్యంలో అధిక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీగానీ నోరు మెదపటం లేదు. హింసను అడ్డుకొనేందుకు వీసమెత్తు ప్రయత్నం కూడా చేయటంలేదని ఆ రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.