న్యూఢిల్లీ: కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు వైద్య సేవల సన్నద్ధతపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.
కొవిడ్ వైరస్ ఉప రకాలు చాలా ప్రమాదకరమైనవేమీ కాదన్నారు. ఇటీవల యువకులు కూడా గుండె పోటుకు గురవుతున్న నేపథ్యంలో కొవిడ్కు-గుండెపోటుకు సంబంధం ఏమైనా ఉందా అనే అంశంపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తున్నదని, రెండు నెలల్లో ఆ సంస్థ నివేదిక అందిస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 214 విభిన్న రకాల కరోనా వేరియంట్లను కనుగొన్నామన్నారు.