చెన్నై/బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి), మార్చి 30: పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది. తమపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఆదేశాలు జారీ అయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి తదితరులు ధ్వజమెత్తారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తమ పెరుగు పొట్లాలపై ‘దహీ’ అనే పదాన్ని ముద్రించబోమని, ఎప్పటి మాదిరిగా ‘తయిర్’ అనే పదాన్నే ముద్రిస్తామని తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (అవిన్) స్పష్టం చేయగా.. తమిళనాడులో హిందీకి స్థానం లేదని ఆ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ఎస్ఎం నాసర్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై కూడా ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనక్కి తగ్గింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ‘కర్డ్’ అనే పేరుతోపాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లో ముద్రించుకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపింది.