Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 3: కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మైసూర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి.. కోర్టు హాల్ వద్ద ఓ ఫైల్ను సెక్యూరిటీ సిబ్బందికి అందజేశాడు. ఆ వెంటనే చీఫ్ జస్టిస్ ఎదుటకు వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు.
అసలేం జరుగుతుందో తెలియని గందరగోళంలో ఉన్న అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని వెంటనే దవాఖానకు తరలించారు. సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘ఇంత తీవ్రమైన చర్యకు అతడు ఎందుకు పాల్పడ్డాడన్నది తెలియలేదు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించలేదు’ అని చెప్పారు.