న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నారు. పోలీసు లాకప్లోనో, జైలుగోడల మధ్యో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో 2016 ఏప్రిల్ -2022 మార్చి మధ్య ఏకంగా 11,656 మంది కస్టడీలోనే మరణించారు. బుధవారం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ వివరాలు వెల్లడించారు.
కస్టడీ మరణాల్లో ఎక్కువగా జ్యుడీషియల్ కస్టడీలో మరణించినవారే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. మొత్తం మరణాల్లో జ్యుడీషియల్ కస్టడీలో మరణించినవారు 93 శాతం కాగా, పోలీస్ కస్టడీలో చనిపోయినవారు 7 శాతంగా ఉన్నట్టు వివరించారు. రాష్ర్టాల వారీగా పరిశీలిస్తే కస్టడీ మరణాల్లో 22 శాతంతో యూపీలో టాప్లో ఉన్నదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకొన్న కస్టడీ మరణాల్లో సగటున 1 కోటి జనాభాకు 85 మంది చనిపోయారని వెల్లడించారు.
కస్టడీ మరణాల్లో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ టాప్లో ఉన్నది. లోక్సభలో కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం.. 2020-2022 మధ్య దేశవ్యాప్తంగా 4,448 కస్టడీ మరణాలు చోటుచేసుకోగా, ఒక్క యూపీలోనే 952 మంది మరణించారు. తర్వాతి స్థానంలో బెంగాల్ ఉన్నది. అక్కడ 442 మంది చనిపోయారు.