డెహ్రాడూన్, జనవరి 4: ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న తమకు సర్వోన్నత న్యాయస్థానం న్యాయం చేయాలని దేవుడిని కోరుతూ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. హల్దానీ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని 29 ఎకరాల స్థలంలో ఐదు దశాబ్దాలకు ముందే ఒక మురికివాడ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ 4,500కు పైగా ఇండ్లు, నాలుగు ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రైవేటు స్కూళ్లు, ఒక బ్యాంకు, ఒక దవాఖాన, బాలికలకు జూనియర్ కాలేజీ, రెండు ఓవర్హెడ్ నీళ్ల ట్యాంకులు, పది మసీదులు, నాలుగు ఆలయాలు ఉన్నాయి. ఈ స్థలం రైల్వేకు చెందినదని పేర్కొంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు గత నెల 20న తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బన్భూల్పురా నివాసులను వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో దిక్కుతోచని స్థానికులు ఒకవైపు నిరసనలు, ఆందోళనలు, ప్రార్థనలు చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టుకు తమ గోడును విన్నవించుకున్నారు.
మూడు బస్తీలుగా ఉన్న బన్భూల్పురాలలో ముస్లింలు అధికంగా ఉన్నందువల్లనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ప్రాంతంపై కక్ష గట్టిందని స్వచ్ఛంద సంస్థల నేతలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డు మీద పడనున్నారని, ఇది అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లకు సంబంధించిన అధికార పత్రాలు, లేఅవుట్లు ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా తాము పన్ను కడుతున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా అది రైల్వే స్థలమని చెప్పడం అన్యాయమని అయూబ్ (65) ఆవేదన వ్యక్తంచేశారు. తమకు నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారని, తన ఇంటికి కార్పొరేషన్ వారు మంజూరుచేసిన లేఅవుట్ మ్యాప్ కూడా ఉన్నదని చెప్పారు. ప్రస్తుత బాలికల జూనియర్ కాలేజీ 1952లో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైందని, దానిని 2005లో కళాశాలగా మార్చారని ఖైరున్నీసా (70) అనే వృద్ధురాలు తెలిపారు. ఈ భూమిపై వివాదం 2007లో మొదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచే ఇక్కడ తమ నివాసాలు ఉన్నాయని, ఈ భూమి రైల్వేదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రాంతంపై బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. భౌగోళికంగా ఈ ప్రాంత రూపురేఖలను మార్చేందుకే తమను ఖాళీ చేయిస్తున్నదని స్థానికులు అంటున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇంతవరకు ఒక్కసారి కూడా బీజేపీ ఇక్కడి నుంచి గెలుపొందలేదు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తమను గెంటివేస్తున్నారని వకార్ రసూల్ అనే యువకుడు ఆరోపించారు. 2017లో సృష్టించిన ఓ మ్యాప్ ఆధారంగానే రైల్వే ఈ స్థలం తనదని చెప్తున్నదని మొహమ్మద్ అయాజ్ పేర్కొన్నారు. ఈ మ్యాప్లతో తమను గందరగోళానికి గురిచేస్తూ, భయపెడుతున్నారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం కింద తాము అడిగిన ప్రశ్నకు రైల్వే వద్ద ఎటువంటి ఆధారాలు లేనట్టు వెల్లడైందని తెలిపారు. ఇక్కడ కొంతమంది స్థానికుల వద్ద 1937 నాటి యాజమాన్య పత్రాలు ఉండటం విశేషం.