ఆదాయంలో ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 98 శాతం. అంతేకాదు, అమెరికన్ ప్రాణంతో పోలిస్తే మనోళ్ల ప్రాణం కూడా కారుచౌక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది నిజం. భారతీయుల ప్రాణం ఖరీదు ఒక అమెరికన్ వాడిపాడేసిన ప్లాస్టిక్ బాటిల్ అంతటి విలువ కూడా చేయట్లేదు. పలువురు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా తీసుకొచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ అమలవుతున్న దేశంలో ప్రస్తుత స్థితిగతులను విశ్లేషించాక, అర్థమవుతున్న వాస్తవ చిత్రమిది..
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అమెరికన్లు వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బీజేపీపాలిత యూపీలోని ముజఫర్నగర్ చిరునామాగా మారింది. ఎక్కడో వాషింగ్టన్లోని కాస్ట్కో కంపెనీ కిర్క్ల్యాండ్ బ్రాండ్ ఆల్మోండ్ రాపర్లు, పురీనా బ్రాండ్ పెట్ డాగ్స్ ఫుడ్ కవర్లు, డాక్టర్ పెప్పర్ సాఫ్ట్ డ్రింక్ టిన్స్, వాడిపారేసిన వాటర్ బాటిల్స్, పాలిథిన్ కవర్లు, అమెజాన్ ఈ-కామర్స్ ర్యాపర్లు ఇప్పుడు ముజఫర్నగర్ యార్డుల్లో గుట్టలుగా కనిపిస్తున్నాయి. సుమారు 8 వేల మైళ్ల దూరాన్ని దాటుకొని అవన్నీ ఇక్కడికెలా వచ్చాయంటూ అమెరికన్ మీడియా ‘బ్లూమ్బర్గ్’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా.. ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
నిషేధించినప్పటికీ..
వ్యర్థాలను కాల్చివేయడం అమెరికాలో నిషిద్ధం. నిబంధనలమేరకు వాటిని రీ-సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. 2 రూపాయల విలువ చేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ను ఫెడరల్ నిబంధనల ప్రకారం రీ-సైక్లింగ్ చేయాలంటే రూ. 11 ఖర్చు అవుతుంది. దీంతో ఆ చెత్తను గతంలో ఆఫ్రికాలోని పేద దేశాలకు తక్కువ ఖర్చుతో తరలించిన అమెరికా.. ఇప్పుడు ఆ రూటును ఇండియాకు మార్చింది. రీ-సైక్లింగ్ కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు, వాడిపారేసిన కాగితాన్ని దిగుమతి చేసుకోవడాన్ని కేంద్రం 2019లోనే నిషేధించింది. అయితే, ముజఫర్నగరలోని కాగితపు ఫ్యాక్టరీ, బెల్లం తయారీ కర్మాగారాలకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరమవుతున్నాయి. చౌకగా అమెరికన్ల వేస్టును దిగుమతి చేసుకొంటున్న అక్కడి పారిశ్రామికవేత్తలు ఆ వ్యర్థాలను తగులబెట్టడం, అట్టల తయారీకి వినియోగించడంతో పాటు పాడైపోయిన ప్లాస్టిక్తో కొత్త బొమ్మలను తయారుచేస్తున్నారు. ముజఫర్నగర్లోని ఓ యార్డులోనే 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఇలాంటి యార్డులు ముజఫర్నగర్తో పాటు పరిసర పట్టణాల్లో వందలాదిగా ఉన్నట్టు పరిశీలనలో తేలింది.
అడ్డాగా అదానీ పోర్టులు..
అమెరికా నుంచి భారత్కు ఏటా 60 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దిగుమతి అవుతున్నట్టు అంచనా. నిషేధం ఉన్నప్పటికీ, దిగుమతులు జరుగడంలో అధికారుల పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలోని పోర్టుల ద్వారానే రవాణా అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి పోర్డులు అదానీ కంపెనీకి చెందినవి కావడం గమనార్హం. బసెల్ కన్వెన్షన్ యూఎన్ ఒప్పందం ప్రకారం.. హానికారక, ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాకు సంబంధించి ఇరు దేశాలు ముందస్తు ఒప్పందం చేసుకోవాలి. అంటే, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అమెరికా వ్యర్థాల దిగుమతుల గురించి తెలియకుండా ఉండదనేది నిపుణుల వాదన. ‘స్వచ్ఛభారత్’ పేరుతో రూ.2.3 లక్షల కోట్ల నిధులను యథేచ్ఛగా ఖర్చు చేస్తున్న బీజేపీ సర్కారు.. అమెరికన్ల వేస్ట్తో దేశం డస్ట్బిన్గా మారుతున్నప్పటికీ చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తున్నది. పథకం నిధులు కూడా ఇలాగే దారి తప్పుతున్నాయా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మన ప్రాణం విలువ.. అమెరికన్ నలిపేసిన ప్లాస్టిక్ బాటిల్కు సమానమా!