ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై దాఖలైన ఓ పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్భాయ్ చోవాటియా శనివారం ఆదేశించారు. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
‘అక్కడ ఒకవేళ డిగ్రీ కాగితాలుంటే వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో! ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా!’ అని కేజ్రీవాల్ ఇటీవల కామెంట్స్ చేశారు. ‘ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించింది’ అంటూ సంజయ్ సింగ్ కామెంట్స్ చేసినట్టు ఫిర్యాదులో నమోదైంది.