చంఢీగఢ్, నవంబర్ 26: ఢిల్లీలో రైతుల మహా ధర్నా తరహా ఆందోళన చంఢీగఢ్లో ప్రారంభమైంది. తమ డిమాండ్ల సాధనకు చంఢీగఢ్కు వేలాది మంది రైతులు పోటెత్తారు. దీంతో ముందు జాగ్రత్తగా సరిహద్దులను మూసివేశారు. పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లు నెరవేర్చుకోవడానికి 12 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు మేరకు రైతులు మూడు రోజుల ఆందోళనకు సిద్ధ పడ్డారు. ప్రధాని మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా అన్నదాతలు జరిపిన ‘ఢిల్లీ ఛలో’ ఆందోళన మూడో వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన మూడు రోజుల ఆందోళనలో భాగంగా ఆదివారం చేపట్టిన ‘చంఢీగఢ్ చలో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో రైతులు చంఢీగఢ్ శివారుకు చేరుకున్నారు.
రైతు ఆందోళనలో భాగంగా ఆయా రాష్ర్టాల రాజ్భవన్ ముందు నిరసనలు జరిపి గవర్నర్లకు నినతిపత్రాలు సమర్పించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. దానిలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి, గవర్నర్లకు వినతిపత్రాలు సమర్పించడానికి రైతులు సిద్ధమయ్యారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లు, కార్లు, మోటారు సైకిళ్లపై పంజాబ్ సరిహద్దు మోహాలి, హర్యానా సరిహద్దు పంచ్కుల వద్దకు చేరుకున్నారు. వీరిలో పురుషులు, మహిళలే కాక బాలురు, బాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. చంఢీగఢ్లో పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అసరమైతే తాము ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండటానికి సిద్ధపడే వచ్చామని వారు పేర్కొన్నారు.
అయితే ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్, చంఢీగఢ్, హర్యానా సరిహద్దుల్లో పెద్దయెత్తున మోహరించిన పోలీసులు వారు చంఢీగఢ్లోకి చేరకుండా సరిహద్దులను మూసివేశారు. కాగా, రైతులు మొహాలీలోని గురుద్వారా ఆంబ్ సాహిబ్ వద్దకు చేరుకుని సోమవారం చంఢీగఢ్ వైపు ర్యాలీగా వస్తారని భావిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో చంఢీగఢ్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. ప్రజలు ముందు జాగ్రత్తగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.