One Nation One Election | బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, 8 మంది సభ్యులతో శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ కమిటీలో కేంద్రమంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాశ్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉండనున్నారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు (వన్ నేషన్-వన్ ఎలక్షన్)’తో ఒకేసారి లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికల అంశంపై నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశం కానున్నదని, వారి అభిప్రాయాలు తీసుకొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న తర్వాతి రోజునే జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే పార్లమెంట్ సమావేశాల అజెండాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇంత అత్యవసరంగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం, అందుకు కారణంగానీ, సమావేశాల ఎజెండాగానీ వెల్లడించకపోవటంతో ఊహాగానాలు మొదలయ్యాయి. లోక్సభను రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతున్నది.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. 2017లో రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ కూడా మోదీ అభిప్రాయానికి మద్దతు పలికారు. 2018లో పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ వరుసగా ఎన్నికల జరుగుతుండటం వలన ఆర్థికంగా భారం అవడంతో పాటు మానవ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇదే సమయంలో వరుస ఎన్నికలతో అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియామావళి వలన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ జరుగాలని, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ర్టాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67 శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఆర్టికల్ 356: రాష్ర్టాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ, వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్ 324: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాలవ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3 చాప్టర్స్, పార్ట్-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు
ప్రతికూలతలు