(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తెలంగాణ రాష్ట్రం నుంచి బయటకు రానీయొద్దు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్వార్కు గట్టి పట్టున్న ప్రాంతాలపై మనం మరింత దృష్టిపెట్టి, వారిని ఆత్మరక్షణలోకి నెట్టాలి. పార్టీ కోసం మరింత కష్టపడాలి. మీ పనితనం మెరుగుపడకపోతే పదవులు ఊడిపోతాయ్’.. ఇదీ… కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తోటి మంత్రులు, బీజేపీ అగ్రనేతలకు ఇచ్చిన వార్నింగ్. రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అని పేరున్న అమిత్ షాకు వణుకు మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అ త్యంత తేలిక కొం తకాలం క్రితం వర కు ధీమాగా ఉన్న ఆయనకు.. ఇప్పుడు గుండెల్లో దడ మొదలైనట్టు కనిపిస్తున్నది. ఈ నెల 6న కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో నిర్వహించిన సమావేశంలో షా తీవ్ర అసహనానికి గురైనట్టు సమాచారం. ఓ దశలో పదవులు ఊడబీకేస్తానంటూ తోటి కేంద్ర మంత్రులపై విరుచుకుపడినట్టు తెలిసింది.
ప్రాంతీయ పార్టీల ఎంట్రీతో మారిన సీన్..
జాతీయ స్థాయిలో కాంగ్రెస్సహా జాతీయ పార్టీలన్నీ చతికిల పడి ఉనికికోసమే కష్టపడుతుండటంతో 2024 లోక్సభ ఎన్నికల్లో తమను ఆపగలిగే శక్తే లేదని కమలనాథులు మొన్నటివరకు కాలరెగరేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి, దేశవ్యాప్తంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు చేయటంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైంది. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ గెలువలేకపోయిన 144 లోక్సభ స్థానాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు 2 దశల ప్రణాళికను అమలు చేస్తున్నది. ఇందులో మొదటి ప్రణాళిక గత ఆగస్టుతో ముగియగా, రెండో ప్రణాళిక ఈ నెల ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో 144 స్థానాల్లో కనీసం 72 చోట్ల బీజేపీ గెలిచి తీరాలని పార్టీ నేతలకు అమిత్ షా టార్గెట్ విధించినట్టు సమాచారం. ఇందులో భాగంగా 40 మంది కేంద్ర మంత్రులకు ఒక్కొక్కరికి ఒకటి నుంచి మూడు స్థానాల వరకు పార్టీ బాధ్యతలను అప్పగించారు.
కీలక స్థానాలపై గురి
బీజేపీ ఎంపిక చేసిన 144 లోక్సభ స్థానాల్లో ప్రతిపక్షాలకు చెందిన పలు కీలక స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో పవార్ కంచుకోట బారామతి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్బరేలీ, తెలంగాణలో మహబూబ్నగర్ తదితర స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలు తీసుకొన్న మంత్రులంతా తమకు అప్పగించిన స్థానాల్లో కనీసం 15 రోజులకోసారి తప్పనిసరిగా రాత్రి నిద్ర చేయాలి. మండల స్థాయి బీజేపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలి. నియోజకవర్గంలో వయసులు, కులాలు, వర్గాల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించాలి. బీజేపీకి అనుకూలురు ఎవరు? వ్యతిరేకులు ఎవరు? అన్నది కూడా గుర్తించాలి అని నిర్దేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించేందుకు బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నది. జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్తో కమిటీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అక్కడి నేతలతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది.
టార్గెట్ కేసీఆర్…!
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్న నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రేనని కమలనాథులు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.నేతలకు అమిత్ షా మూడు లక్ష్యాలను నిర్దేశించినట్టు చెప్తున్నారు. అందులో మొదటిది కేసీఆర్ను కట్టడి చేయటమే. మిగతావి మహారాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రేను, శరద్పవార్ను ఇబ్బంది పెట్టడం. కేసీఆర్ను కట్టడి చేసేందుకు ఆయన కూతురు కల్వకుంట్ల కవితను, పవార్ను అడ్డుకొనేందుకు ఆయన కుమార్తె సుప్రియా సూలేను టార్గెట్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఇద్దరు మహిళా నేతలను అడ్డుకొనే పనిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్కు అమిత్షా అప్పగించినట్టు చెప్తున్నారు.