Amit Shah : కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని, వాళ్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
లొంగిపోయేందుకు మావోయిస్టులు ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని హోంమంత్రి అన్నారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి.. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని చెప్పారు.
తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. బస్తర్ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతాదళాలు తగిన సమాధానం ఇస్తాయని ఆయన హెచ్చరించారు.