న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. స్టూడెంట్స్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం నుంచి విమాన సర్వీసులను రెండు రెట్లు పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అమెరికాలో కరోనా కేసులు, విమాన ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు గణనీయంగా తగ్గాయి. ఆంక్షలకు ముందు అమెరికాకు రెండు వైపులా సుమారు 40 విమానాలు నడిపినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఆంక్షల వల్ల ఈ సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది జూలైలో అమెరికాకు 11 విమానాలు నడిపినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. కాగా జూలై 22 నుంచి ఆగస్ట్ 7 వరకు టికెట్ల బుకింగ్ బాగా పెరిగినట్లు తెలిపింది.
మరోవైపు అనివార్య కారణాల వల్ల ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాల రీషెడ్యూల్పై విద్యార్థుల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్లో అదనపు విమానాలు నడుపుతామని ఆ సంస్థ తెలిపింది. ఆగస్ట్ 6,13,20,27 తేదీల్లో న్యూఢిల్లీ-న్యూయార్క్ మధ్య ప్రస్తుతం ఉన్న సర్వీసులతోపాటు అదనపు విమాన సర్వీసులు నడుపుతామని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొంది.