న్యూఢిల్లీ: ఇజ్రాయిల్పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. ఏఐ 139 విమానం శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 7.05 గంటలకు టెల్ అవీవ్ చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో ఏఐ140 విమానం టెల్ అవీవ్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే శనివారం ఉదయం ఇజ్రాయిల్పై హమాస్ అనూహ్యంగా దాడి చేసింది. గాజా నుంచి సుమారు ఐదు వేల క్షిపణులను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయిల్ కూడా ఎదురు దాడులు ప్రారంభించింది. తాము యుద్ధంలో ఉన్నట్లు ఆ దేశం పక్రటించింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంబంధిత ప్రయాణికులకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొంది.
మరోవైపు పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్కు విమాన సేవలను నిలిపివేశాయి. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్, ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్, టర్కిష్ ఎయిర్లైన్స్తో సహా అనేక విమానయాన సంస్థలు ఇజ్రాయిల్కు విమానాలను రద్దు చేశాయి.
Hamas terrorists' attack on Israel | An Air India Flight from Delhi to Tel Aviv on 07 October 2023 and the return flight AI140 from Tel Aviv to Delhi has been cancelled in the interests and safety of our guests and crew. Passengers are being extended all support, as per their… pic.twitter.com/VdynXz0M6F
— ANI (@ANI) October 7, 2023