న్యూఢిల్లీ, జనవరి 27: అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) క్యాడర్ నిబంధనల్లో సవరణలకు కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదనలపై 109 మందితో కూడిన సివిల్ సర్వీసెస్ మాజీ అధికారుల బృందం గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాడర్ రూల్స్లో చేపట్టనున్న సవరణలు.. అధికార దుర్వినియోగం చేయడానికి కేంద్రప్రభుత్వానికి రాచమార్గాన్ని ఏర్పాటు చేసేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాలపై కక్ష్య సాధింపులో భాగంగా కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారులను కేంద్రం తమ వద్దకు తీసుకొచ్చుకొనే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించింది. విస్తృత వర్గాలను సంప్రదించకుండానే, అనాలోచితంగా హడావుడిగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది. తాజా సవరణలు అసమంజసమైన ఏక పక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. తాజా సవరణలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకపోతే రాజ్యాంగ మూల సూత్రాలకు తీరని నష్టం చేకూరే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. బృందంలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐఏఎస్ నజీబ్ జంగ్, మాజీ విదేశాంగ కార్యదర్శి, దేశ మాజీ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిైళ్లె, మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ విక్రమ్ సింగ్ ఉన్నారు.
ఏకపక్షంగా చర్యలు
ఫెడరల్ సమాజంలో కేంద్రం, రాష్ర్టాలు భిన్నమైన, ప్రత్యేకమైన వ్యవస్థలని సివిల్ సర్వీసెస్ మాజీ అధికారుల బృందం పేర్కొంది. అయినప్పటికీ, ఉమ్మడి రాజ్యాంగ లక్ష్యాలని నెరవేర్చేందుకు కలిసి పనిచేస్తాయని వెల్లడించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన ఏఐఎస్ క్యాడర్.. ఈ రెండు ప్రభుత్వాల మధ్య (కేంద్రం, రాష్ర్టాలు) స్థిరత్వం, సంతులనం కోసం కృషి చేస్తుందని గుర్తుచేసింది. అయితే, తాజా సవరణలు.. ఏఐఎస్పై కేంద్రానికి ఏకపక్షంగా పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారితో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధంలేకుండా ఇష్టంవచ్చినప్పుడు లక్షిత అధికారిని రప్పించుకొనే వీలు ఈ సవరణలతో కేంద్రానికి లభిస్తున్నదని వాపోయింది. సమాఖ్యస్ఫూర్తిని రక్షించే ఏఐఎస్ వ్యవస్థను అపహాస్యం చేసేలా కేంద్రం తాజా నిర్ణయం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.