Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల ప్రియులకు అద్భుతమైన అవకాశం కల్పించాడు. ఆల్ఫోన్సో మామిడిపండ్ల రుచిని ఆస్వాదించాలని కోరుకునే వారి కోసం ఈఎంఐ పథకాన్ని తీసుకువచ్చాడు. మామిడిపండ్లలో ఆల్ఫోన్సో రారాజుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ మామిడిపండ్లను ఇష్టంగా తింటుంటారు. కానీ, ఈ పండు ధరలు మాత్రం అందరికీ అందుబాటు ధరల్లో ఉండవు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ వ్యాపారి ఈఎంఐపై మామిడిపండ్లను విక్రయిస్తున్నాడు. హాపస్ పేరుతో పిలిచే ఆల్ఫోన్సో మామిడిపండ్లు ప్రత్యేకమైన రుచి, సువాసనను కలిగి ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది. ఈ కారణంగా డిమాండ్ భారీగా ఉండడంతో.. మిగతా మామిడిపండ్లతో పోలిస్తే వీటి ధరలు అధికంగా ఉంటాయి. ఆల్ఫోన్సో మామిడి కేవలం మహారాష్ట్రలోని దేవ్గడ్, కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరిలోని దక్షిణ ప్రాంతంలో పండిస్తారు.
పుణేలోని గురుకృపా ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ నడుపుతున్న మహారాష్ట్రకు చెందిన గౌరవ్ సనాస్ మాట్లాడుతూ ఈఐఎంలో మామిడిపండ్లను ఎందుకు కొనుగోలు చేయకూడదని ప్రశ్నించాడు. ‘రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండీషనర్లను వాయిదాల్లో కొనుగోలు చేస్తున్నప్పుడు మామిడిపండ్లను ఎందుకు కొనకూడదు’ అన్నారు. ఆల్ఫోన్సో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో డజన్ రూ.800 నుంచి రూ.1300 వరకు విక్రయిస్తున్నారు. అయితే, దేశంలోనే తొలిసారిగా మామిడిపండ్లను ఈఎంఐపై తన అవుట్ లెట్ ద్వారా విక్రయిస్తున్నట్లు చెప్పాడు. ‘సీజన్ ప్రారంభంలో ధరలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఏసీలు, గృహోపకరాలు ఈఎంఐపై కొనుగోలు చేస్తున్నాం. మరి మామిడిపండ్లను ఎందుకు కొనుగోలు చేయకూడదు. ఈఎంఐలో ఉంటే అందరూ ఈ మామిడిపండ్లను కొనుగోలు చేస్తారు’ అంటూ గౌరవ్ పేర్కొన్నాడు.
అవుట్ లెట్లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన మాదిరిగానే మామిడిపండ్లు కొనుగోలు చేయవచ్చని గౌరవ్ తెలిపాడు. కస్టమర్ క్రెడిట్ కార్డ్ను మాత్రమే వినియోగించాలని, మూడు నుంచి 12 నెలల ఈఎంఐకి మార్చుకోవచ్చని చెప్పాడు. అయితే, ఈ స్కీమ్ మాత్రమం కనీసం రూ.5వేలు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పాడు. ఇప్పటి వరకు నలుగురు ఈఎంఐలో మామిడిపండ్లను కొనుగోలు చేశారని చెప్పాడు. ఆల్ఫోన్సో మామిడిపండ్లకు అధిక ధర కారణంగా ప్రజలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదని, కొవిడ్ తర్వాత అధిక ధరలతో ఆల్ఫోన్సో మామిడి పండ్లపై ఆసక్తి తగ్గుతున్నట్లుగా కనిపిస్తుందని చెప్పాడు. దాంతో ఈఎంఐ స్కీమ్ను తీసుకువచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన అవుట్ లెట్లో మామిడిపండ్లు డజన్కు రూ.600 నుంచి రూ.1300 మధ్య ఉందని తెలిపాడు. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండు మూడేళ్లుగా వ్యాపారం దెబ్బతిందని, ఈ సారైనా లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్లు గౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.