న్యూఢిల్లీ, ఆగస్టు 9: బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసింది. మణిపూర్లో గిరిజన మహిళల నగ్న ఊరేగింపు ఘటన దేశం అంతటిని చలింపచేసిందని పేర్కొంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కిసాన్ మోర్చా తీర్మానించినట్టు తెలిపింది. ఆందోళనలో అసువులు బాసిన అమర రైతు కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, వారికి పునరావాసం కల్పించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరినట్టు వెల్లడించింది.