న్యూఢిల్లీ, మే 2: నమాజ్ చేయడానికి లేదా మతపరమైన భారీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ భూమిని హక్కుగా ఉపయోగించరాదని అలహాబాద్ హైకోర్టు శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజా స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్కు లేదా భద్రతకు, ఇతరుల హక్కులకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని సంభల్ జిల్లాకు చెందిన ఇకొన గ్రామంలోని స్థలంలో నమాజ్ చేసేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆ భూమి తన సొంత ఆస్తి అని, అందులో ప్రార్థనలు చేసేందుకు అధికారులు రక్షణ కల్పించాలని కోరుతూ అసీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ని జస్టిస్ గరిమ ప్రసాద్, జస్టిస్ సరల్ శ్రీవాస్తవతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. భూమి తన సొంతమైనప్పటికీ తనను నమాజ్ చేయకుండా చట్టవిరుద్ధంగా అడ్డుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్తిలో నమాజ్ చేయడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని పేర్కొంటూ ప్రార్థనలపై ఆంక్షలు విధించడం తన రాజ్యాంగపరమైన హక్కులను అతిక్రమించడమేనని ఆయన వాదించారు.
ఈ పిటిషన్ని తిరస్కరించిన యూపీ ప్రభుత్వం ఆ భూమి రెవెన్యూ రికార్డులలో ప్రజా వినియోగం కోసం ఉద్దేశించిన అబాదీ భూమి(నివాసయోగ్యమైన భూమి)గా నమోదైందని, చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని వాదించింది. పిటిషనర్ ఉదహరించిన దానపత్రంలో భూమిని గుర్తించే ముఖ్యమైన గుర్తులు లేవని కోర్టుకు తెలిపింది. పిటిషనర్ గ్రామం లోపల, వెలుపల నుండి ప్రజలను ఆహ్వానించడం ద్వారా సాధారణ సామూహిక ప్రార్థనలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది స్థానిక సామాజిక సమతుల్యతకు భంగం కలిగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇచ్చినప్పటికీ అది ప్రజా భద్రత, నైతికత, ఆరోగ్యం పరిధిలోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ భూమి ఉమ్మడి వినియోగం కోసం ఉద్దేశించిందని, దాన్ని పౌరుల శాంతి భద్రతలకు భంగం కలిగించే మతపరమైన కార్యకలాపాల కోసం వినియోగించరాదని స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రార్థనలకు, మతపరమైన సమావేశాలకు మధ్య వైరుధ్యం ఉందని ్ట తెలిపింది. భూ యాజమాన్యాన్ని నిరూపించడంలో విఫలం కావడం, ఆ భూమి ప్రభుత్వ భూమిగా వర్గీకరించిన స్థితి కొనసాగడంతో పిటిషన్ని కోర్టు కొట్టివేసింది.