న్యూఢిల్లీ, నవంబర్ 21: కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నీ ఐక్యంగా గళమెత్తనున్నాయి. దీని కోసం ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీల అనుబంధ విద్యా సంఘాలు సహా దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ ‘యూనైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఏకమై పోరాటం సాగించనున్నాయి.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12న పార్లమెంట్కు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని 16 విద్యార్థి సంస్థలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్థులు సమస్యలపై పోరాటం చేస్తారని డీఎంకే విద్యార్థి విభాగం నేత జేజహిరసన్ తెలిపారు. విద్యా వ్యవస్థ వాణిజ్యీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణపై యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా పోరాడుతుందని చెప్పారు.