న్యూఢిల్లీ: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల( Sainik Schools )లో బాలికలకు ఎంట్రీ ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంది బాలికలు నాకు లేఖలు రాస్తున్నారు. అందుకే ఇక నుంచి బాలికల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. రెండున్నరేళ్ల కిందట తొలిసారి ప్రయోగాత్మకంగా మిజోరంలోని సైనిక్ స్కూల్లో బాలికలను అనుమతించినట్లు మోదీ చెప్పారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లు మన దేశంలోని కూతుళ్ల కోసం తలుపులు తెరుస్తాయని ఆయన తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ సైనిక్ స్కూళ్లను నిర్వహిస్తుంది. భారత సాయుధ బలగాల వైపు అడుగులు వేసేలా చిన్నతనం నుంచే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.