న్యూఢిల్లీ, జూన్ 24: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 12వ తరగతి ఫలితాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ర్టాల బోర్డులను ఆదేశించింది. మార్కుల మదింపు విధానాన్ని సాధ్యమైనంత త్వరగా, గరిష్ఠంగా 10 రోజుల్లోగా కోర్టుకు తెలపాలని సూచించింది. అన్ని బోర్డులు ఒకే రకమైన మూల్యాంకన విధానాన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ప్రతీ బోర్డుకు స్వయంప్రతిపత్తి ఉందని, విద్యార్థులకు మార్కులను ఎలా కేటాయించాలన్న అంశంపై వాటికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. అందువల్ల మాల్యాంకన విధానంపై తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయబోమని జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలపై కూడా సుప్రీంకోర్టు గతంలో ఇదే తరహా ఆదేశాలను జారీచేసింది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు 21 రాష్ర్టాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. 6 రాష్ర్టాల్లో బోర్డు పరీక్షలను నిర్వహించారు.