బెంగళూరు, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమదైన తీర్పు ఇవ్వడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. నేడు(బుధవారం) రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బందోబస్తుకు 1.56 లక్షల మంది పోలీసులను, హోంగార్డులను నియమించారు. సీఎం బొమ్మై (బీజేపీ) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు.
అందరి నినాదం.. ‘మెజారిటీ ప్రభుత్వం’!
బెంగళూరు: 2018 అనుభవాల నేపథ్యంలో ‘పూర్తి మెజారిటీ ప్రభుత్వం’ నినాదంతో ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ నెల రోజుల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. సుస్థిరమైన, బలమైన ప్రభుత్వ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాలనకు అవకాశమివ్వమని ఓటర్లను అభ్యర్థించాయి.
జాతీయ పార్టీలకు కీలకం
ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి 2024 లోక్సభ ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధం కావాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం చాలా వరకు ‘40 శాతం కమీషన్’ చుట్టే తిరిగింది. సంక్షేమ పథకాలతో అవినీతి రహిత పాలన అందిస్తామని కాంగ్రెస్ ప్రచారం చేయగా… ఉచిత తాయిలాలతో ఓటర్లకు గాలం వేయాలని బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ సంకుచిత రాజకీయాల కారణంగా చివరకు భగవాన్ హనుమంతుడి పేరు కూడా ఎన్నికల ప్రచారంలోకి ప్రవేశించింది! అయితే ఈసారి అవినీతి, అభివృద్ధి అంశాలే ఎన్నికలపై ప్రభావం చూపనునాయి.
ఈ సారైనా ‘కింగ్’ అవుతారా!?
‘పంచరత్న’ ప్రణాళికతో ‘టార్గెట్ 123’ని నిర్దేశించుకున్న జేడీ(ఎస్) తన ప్రయత్నంలో ఏ మేరకు సఫలం అవుతుందనేది నేటి పోలింగ్తో తేలనుంది. జాతీయ పార్టీలకు ‘బీ టీమ్’గా విమర్శలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఈసారి ఎలాగైనా పాత మైసూర్తో సరి పెట్టుకోకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లు, సీట్లు కొల్లగొట్టాలని ఆశ పడుతున్నది. అయితే అంతర్గత విబేధాలు, కుటుంబ రాజకీయాలు ఆ పార్టీని ఈసారి కూడా కొంత ఇబ్బంది పెట్టాయి. గతంతో(37) పోలిస్తే ఈసారి మెరుగైన సీట్లను సాధించి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) భావిస్తున్నది. అయితే కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోతేనే, జేడీఎస్కు ఆ అవకాశం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.