Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ సహా ఉత్తరభారతం మొత్తం వాయు కాలుష్యంతో నిండిపోయి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్ నోయిడా (Noida) లోని అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నవంబర్ 10వ తేదీ వరకూ ప్రీ స్కూల్స్ నుంచి 9వ తరగతి వరకూ పాఠశాల సెలవు ప్రకటిస్తూ జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు తెరిచే వరకూ ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా ఉన్నట్టు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంజాబ్, హర్యానా రైతులు పంటలు వేసేందుకు ముందు పొలాల్లోని గడ్డీగాదాన్ని తగులబెట్టడం వల్ల ఏర్పడే పొగ గాలిలో కలిసి ఢిల్లీ దిశగా వస్తుంది. ఈ కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.
మరోవైపు ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల కాల్చివేత వెంటనే ఆగిపోవాలన్నదే తమ అభీష్టమని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ‘పంట వ్యర్థాల కాల్చివేత ఆగిపోవాలని మేం కోరుకుంటున్నాం. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. స్టబుల్ బర్నింగ్ను నిలిపి వేయడం మీ బాధ్యత. తప్పనిసరిగా స్టబుల్ బర్నింగ్ ఆగిపోవాలి. అందుకోసం తక్షణమే ఏదో ఒక చర్య చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read..
Zara Patel | ఈ ఘటనతో తీవ్రంగా కలతచెందా.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై జారా పటేల్ ఆవేదన
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Wipro | ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పిన విప్రో.. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే