తృణమూల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఝలక్ ఇచ్చారు. ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేసేశారు. ఇదే కాకుండా… పార్టీలోని ఇతర పదవులను కూడా రద్దు చేసేశారు. ఒక్క పార్టీ చైర్పర్సన్ అన్న పదవి మినహా. ఎందుకంటే ఆ పోస్టులో మమతా బెనర్జీయే ఉన్నారు కాబట్టి. కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. సీనియర్లకు, జూనియర్లకు మధ్య గ్యాప్ వచ్చింది. వీరికే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది.
ఇక.. ఒకే వ్యక్తి- ఒకే పదవి అన్న క్యాంపెయిన్ను మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. దీంతో సీనియర్లు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి క్రమశిక్షణా రాహిత్యం తాండవిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చైర్పర్సన్ మినహా.. మిగతా పదవులన్నింటినీ తీసిపారేశారు. 20 మంది సభ్యులతో ఓ జాతీయ కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించారు. ఇందులో మమతా అల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పేరు ఉంది. అయితే సీనియర్లైన సౌగతా రాయ్, ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్లు మాత్రం లేవు.
కొన్ని రోజులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య గ్యాప్ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీలో మార్పులు అనివార్యమని అభిషేక్ బెనర్జీ గట్టిగా వాదిస్తున్నారు. అలా కుదరదని పార్టీ చీఫ్, సీఎం మమత తెగేసి చెప్పేశారు. అయినా అభిషేక్ తన మద్దతు దారులతో ఒకే వ్యక్తి-ఒకే పదవి అన్న క్యాంపెయిన్ను నడుపుతున్నారు. దీంతో సీనియర్లు, రెండు పదవులు అనుభవిస్తున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. పార్టీ సక్రమంగా నడుస్తున్న వేళ… అభిషేక్ తెచ్చిన ఈ తంటాతో సీఎం మమత ఆయనకే ఝలక్ ఇచ్చారు. ఆయన అనుభవిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టునే రద్దు చేసేశారు. సీనియర్లు అధికంగా ఉన్న జాతీయ కార్యవర్గ జాబితాలో ఆయన్ను చేర్చుతూ సీఎం మమత సంచలన నిర్ణయం తీసుకున్నారు.