Karnataka |బెంగళూరు, నవంబర్ 6: కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీలాట కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. తాజాగా మంత్రి సతీశ్ జార్ఖిహోళి సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకొంటారని, ఆ మేరకు డిమాండ్లు కూడా ఉన్నాయని, అయితే దానిపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో వాల్మీకి గురుపీఠ స్వామీజీ ప్రసన్నానంద తనను సీఎంగా చూడాలనుకొంటున్నట్టు చేసిన ప్రకటనపై సతీశ్ జార్కిహోళి స్పందిస్తూ.. అది పాత విషయమేనని చెప్పారు.
తాము అధికారంలోకి రాక ముందు నుంచి కూడా ఆయన అదే చెబుతున్నారని పేర్కొన్నారు. కమ్యూనిటీ సమావేశాల్లో ఈ అంశం తెరపైకి వస్తుందని, ఈ డిమాండ్ పలు సందర్భాల్లో గతంలో కూడా వచ్చిందని అన్నారు. సీఎం రేసులో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దళితులు, లింగాయత్లు, వొక్కళిగలు, ఇలా అన్ని కమ్యూనిటీల నుంచి తమ నేత సీఎం కావాలనే డిమాండ్ ఉన్నదని, అదేవిధంగా తనను సీఎం చేయాలనే డిమాండ్ కూడా వచ్చిందని చెప్పారు. పీడబ్ల్యూడీ మంత్రి, రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సతీశ్ జార్కిహోళి వాల్మీకి(ఎస్టీ) వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నారు.
గతంలోనూ డిమాండ్లు వచ్చాయ్
‘దళిత సీఎం డిమాండ్ 2013లో కూడా వచ్చింది. ఈ అంశాన్ని తర్వాత కూడా పదేపదే లేవనెత్తారు. ఆ ఐదేండ్ల టర్మ్లో చాలా రోజులు ఆ డిమాండ్ నడిచింది. అయితే అది జరుగలేదు. అదీ పరిస్థితి’ అని జార్కిహోళి గుర్తుచేశారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘మనం వేచిచూడాల్సిన అవసరం ఉన్నది. 2008లో ఖర్గేజీ పోటీదారుగా, దళిత సీఎం డిమాండ్ వచ్చింది. అయితే ఆయనకు అవకాశం రాలేదు.
ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న జీ పరమేశ్వర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనిమిదేండ్లు ఉన్నారు. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే సీఎం అయ్యేందుకు చాన్స్ రాలేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వ రెండున్నరేండ్ల టర్మ్ తర్వాత ఇది జరుగుతుందా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ ‘అది మన చేతుల్లో లేదు. అక్కడ హైకమాండ్ ఉంటుంది. సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు.. ఇలాంటి వాటిపై వారు మాత్రమే చెప్పగలరు’ అని అన్నారు.
అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి
పార్టీలో ఇటీవలి పరిణామాలు, డీకే శివకుమార్ తీరుపై అసంతృప్తిగా ఉన్న జార్కిహోళి.. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలతో సహా దాదాపు 50 మంది నేతలతో క్యాంపు ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అధిష్ఠానం జోక్యంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకొన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడో అధికార కేంద్రంగా మారాలనుకొంటున్నారా? అని మీడియా అడుగ్గా.. అదేమీ లేదని, రాష్ట్రంలో ఒకే వవర్ సెంటర్ ఉంటుందని, అది అధిష్ఠానం మాత్రమేనని జార్కిహోళి చెప్పుకొచ్చారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ కేవలం బయట మాట్లాడేవారు, టీవీలో కనిపించే వారు మాత్రమే నాయకులు కాదు.. బయటకు పెద్దగా మాడ్లాడని వారికి కూడా సామర్థ్యం, జ్ఞానం ఉంటుందని, అటువంటి వారికి కూడా ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉన్నదన్నారు.