hottest cities : భారత దేశం ఎప్పుడూ లేనంతగా ఎండలతో అట్టుడికిపోతోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా భారీగా ఎండలు నమోదయ్యాయి. ఇక, తెలంగాణలోని జగిత్యాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 43 డిగ్రీల ఎండలతో జగిత్యాల దేశంలోనే 11వ స్థానంలో ఉండటం విశేషం. ఉదయం ప్రపంచంలోనే అత్యధిక ఎండ (ఉష్ణోగ్రత) కలిగిన టాప్ 50 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి.
వాతావరణం, ఉష్ణోగ్రతలు వంటి వాటిని పరిశీలించే ఏక్యూఐ డాటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు అత్యధిక ఎండలు ఇండియాలోనే నమోదయ్యాయి. టాప్ 50 నగరాల్లో ఇతర దేశాలకు చెందిన ఒక్క నగరం కూడా లేదంటే దేశంలో ఏ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉదయం పదకొండు గంటలకు ముందే ఒడిశాలోని బాలంగిర్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం కూడా కాకముందే ఇలా అనేక చోట్ల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రెండో స్థానంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ (44 డిగ్రీలు), మూడో స్థానంలో యూపీలోని ప్రయాగ్రాజ్ (44 డిగ్రీలు), నాలుగు, ఐదు స్థానాల్లో చత్తీస్గడ్లోని బిలాస్పూర్, మహాసముంద్ (44 డిగ్రీలు), ఆరవ స్థానంలో బిహార్లోని బుక్సర్ (44 డిగ్రీలు), ఏడో స్థానంలో చత్తీస్గడ్లోని దుర్గ్ (44 డిగ్రీలు), ఎనిమిదో స్థానంలో బిహార్లోని సాసారామ్ (43 డిగ్రీలు), తొమ్మిదో స్థానంలో చత్తీస్గడ్లోని భిలాయ్ (43 డిగ్రీలు), పదో స్థానంలో యూపీలోని మీర్జాపూర్ (43 డిగ్రీలు) నిలిచాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో తెలంగాణకు చెందిన జగిత్యాల ఉంది.
వాయువ్య భారతం నుంచి వేడిగాలులు వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందని వాతావరణ నిపుణులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఒడిశా, చత్తీస్గడ్ మీదుగా మధ్యప్రదేశ్.. అటు నుంచి యూపీ, బిహార్, హరియాణా, ఉత్తర ప్రదేశ్లకు వడగాల్పులు వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ ప్రభావానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.