లక్నో : యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు. మతపరమైన కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు ప్రోత్సహించడం మతతత్వాన్ని ప్రేరేపించడమేనని మౌర్య పేర్కొన్నారు. యూపీ జైళ్ల శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి మంత్రిగా ప్రమాణం చేసే క్రమంలో చేసిన ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహరించారని మండిపడ్డారు.
ఖైదీలు ఇష్టపూర్వకంగానే హనుమాన్ చాలీసా పఠిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించిన అనంతరం మౌర్య ఈ అంశంపై స్పందించారు. కాగా, ప్రతి శనివారం ఖైదీలు ఇష్టపూర్వకంగానే హనుమాన్ చాలీసా పఠిస్తున్నారని, మంగళవారం సుందరకాండ పారాయణం చేస్తున్నారని జైళ్ల శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఖైదీలను హనుమాన్ చాలీసా పఠించాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పారు.
ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వారు తమ మతపరమైన వాక్యాలను, మంత్రాలను పఠించవచ్చనేదే తమ ఉద్దేశమని మంత్రి చెప్పుకొచ్చారు. అన్ని మతాల ప్రజలు జైళ్లలో ఉన్నారని, ఇతర మతాలకు చెందిన వారు ఏదైనా మతపరమైన పుస్తకం, వస్తువు కావాలంటే జైళ్ల శాఖ సమకూరుస్తుందని చెప్పారు. జైలులో ప్రార్ధనలు చేసుకునే స్వేచ్ఛ కూడా ఖైదీలకు కల్పించామని అన్నారు. జైలులో మంత్రాలు చదివేందుకు గతంలో తాను ఉత్తర్వులు జారీ చేశానని మంత్రి ప్రజాపతి గుర్తుచేశారు.
Read More :