లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ కాషాయ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతకుముందు కన్నౌజ్లో జరిగిన ర్యాలీలో యోగి, మోదీ సర్కార్లపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
యూపీలో ముగిసిన రెండు దశల పోలింగ్లో ఎస్పీ కూటమి సెంచరీ స్ధానాల్లో పాగా వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కన్నౌజ్లోనూ తమను ప్రజలు ఆదరిస్తే కాషాయ పార్టీని మట్టికరిపిస్తామని చెప్పారు. బీజేపీ కర్హల్ అభ్యర్ధి ఎస్పీఎస్ బాఘేల్, బీజేపీ ఎంపీ గీతా షక్యలపై దాడుల గురించి కాషాయ పార్టీ గగ్గోలు పెడుతోందన్న అఖిలేష్ ఓటమి భయంతోనే బీజేపీ తమ నేతలపై తమ పార్టీ వారితోనే దాడులు చేయించుకుని హంగామా చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర బలగాలతో పాటు శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన యూపీ ప్రభుత్వం ఏం చేస్తోందని అఖిలేష్ నిలదీశారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులొడ్డి పోరాడుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు కుటుంబ పార్టీ ఎస్పీకి ప్రజా సంక్షేమం పట్టదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మండిపడ్డారు. ఝాన్సీలో గురువారం జరిగిన ర్యాలీలో ఎస్పీ, కాంగ్రెస్ లక్ష్యంగా యూపీ సీఎం ఆరోపణలు గుప్పించారు.