లక్నో : పెట్రోల్, డీజిల్ ధరల పెంచి ప్రజలపై బీజేపీ పెనుభారం మోపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ శనివారం బలరాంపూర్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను నిత్యం పెంచుతున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పేదల నుంచి డబ్బు దండుకుని బడా వ్యాపారులకు పంచాలని కోరుకుంటోందని మండిపడ్డారు. ప్రజలు ఎస్పీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారని, బాబా సీఎం (యోగి ఆదిత్యానాధ్) మార్చి 11న గోరఖ్పూర్ తిరిగివెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ పాలకులు తిరిగి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని శుక్రవారం జరిగిన ఓ సభలో అఖిలేష్ కాషాయ పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పేదలు వాహనాలు నడపలేని పరిస్ధితి తీసుకువచ్చిందని ఆరోపించారు.
చివరికి రైతులు సైతం ట్రాక్టర్లను నడపలేకపోతున్నారని, ఎన్నికలు ముగిశాక లీటర్ పెట్రోల్ రూ 200కు పెంచుతారని వార్తాపత్రికలు కూడా రాస్తున్నాయని అఖిలేష్ గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నేతలు హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం పనియారలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ బీఎస్పీ, ఎస్పీ, బీజేపీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు.ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఎలాంటి పనులు చేయకుండానే అధికారం చేపట్టేలా వ్యవహరించడంతో పార్టీలకు కులాలు, మతాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.