లక్నో : యూపీలోని ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం సాధించిన పార్టీ అభ్యర్ధి సుధాకర్ సింగ్ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అభినందించారు. ఇది విపక్ష ఇండియా కూటమి విజయమని, ఈ విజయ పరంపర రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్పీ అభ్యర్ధి 88,000కుపైగా ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్ధి దారా సింగ్ చౌహాన్పై 30,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సుధాకర్ సింగ్ గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి విజయంపై అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఘోసీ నియోజకవర్గ ప్రజలు ఎస్పీ అభ్యర్ధిని గెలిపించడంతో పాటు ఇండియా కూటమికి పట్టం కట్టారని ట్విట్టర్ వేదికగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2022 జులైలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలిచిన దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఘోసీ ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, దారా సింగ్ చౌహాన్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున చౌహాన్ పోటీ చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా ధూప్గురి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలక టీఎంసీ (TMC) విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి నిర్మల్ చంద్ర రాయ్ 4000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధిపై గెలుపొందారు. టీఎంసీ అభ్యర్ధికి 96,961 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి తపసీ రాయ్ 92,648 ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్ధి ఈశ్వర చంద్ర రాయ్ 13,666 ఓట్లు రాబట్టి మూడో స్ధానంలో నిలిచారు. టీఎంసీ అభ్యర్ధి గెలుపుపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ తమ పార్టీ పట్ల విశ్వాసం ఉంచిన ఓటర్లకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ధూప్గురి ప్రజలు తమపై విశ్వాసం కనబరిచారని, తమ వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సాధికారతకు చేస్తున్న కృషికి పట్టం కట్టారని అన్నారు.
Read More :
Sanatan Dharma: రావణుడు, కంసుడు విఫలమయ్యారు.. ఈ పరాన్నజీవులెంత !