లక్నో : యూపీలో తాము అధికారంలోకి వస్తే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతుల కుటుంబాలకు రూ 25 లక్షల పరిహారం అందచేస్తామని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. దేశ ప్రజల ఆకలి తీర్చే అన్నదాత జీవితం అమూల్యమైనదని, 2022లో తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన రైతులకు రూ 25 లక్షల చొప్పున అందచేస్తామని స్పష్టం చేశారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవడంపై అఖిలేష్ యాదవ్ ఇటీవల స్పందిస్తూ తమ పార్టీ చేపట్టిన విజయ్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో భయపడిన కేంద్రం సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. సంపన్నులకు అండగా ఉండే కాషాయ పార్టీ రైతులను నల్ల చట్టాలు, భూ సేకరణతో మోసం చేస్తోందని అఖిలేష్ మండిపడ్డారు. రైతులపై వాహనాలను ఎక్కించి, వారిని అడుగడుగునా అవమానించే బీజేపీ పూర్వాంచల్లో ఎస్పీ చేపట్టిన విజయ్ యాత్రకు ప్రజల మద్దతును చూసి బెంబేలెత్తి సాగు చట్టాలను వెనక్కితీసుకుందని వ్యాఖ్యానించారు. వందలాది రైతుల ఉసురు తీసిన దోషులను ఎప్పుడు శిక్షిస్తారో బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.