లక్నో : జనాభా ప్రాతిపదికన ప్రజలకు వారి హక్కులను సంక్రమింపచేసేందుకు వీలుగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కులాల వారీగా జన గణన చేపడతామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. కులాల వారీగా జనగణన నిర్వహిస్తే అన్నీ సర్దుకుంటాయని తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ సొంత పార్లమెంట్ నియోజకవర్గం మొయిన్పురిలో జరిగిన విజయయాత్రలో అఖిలేష్ పేర్కొన్నారు.
తమ పార్టీ గతంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుందని అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ కేవలం సంస్ధల పేర్లు, రంగులు మారుస్తారని, గతంలోనే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ శంఖుస్ధాపనలు చేస్తూ హడావిడి చేస్తుంటారని ఆరోపించారు. మీకు యోగి కావాలా యోగ్యత కలిగిన ప్రభుత్వం కావాలా ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.
తాను తన బాబాయికి చెందిన పీఎస్పీఎల్ పార్టీతో జట్టుకట్టగానే ఢిల్లీ నుంచి బీజేపీ కనుసన్నల్లో పనిచేసే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్ధలు చురుకుగా మారాయని ఎద్దేవా చేశారు. బీజేపీని ఓటమి భయం వెంటాడుతుండటంతో ఈ సంస్ధలు ఎస్పీ నేతల ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ రధయాత్రకు భయపడిన బీజేపీ రాష్ట్రంలోని ఆరు చోట్ల జన్ విశ్వాస యాత్రలు చేపడుతోందని కాషాయపార్టీకి చురకలు వేశారు.