లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు సోమవారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. రాయ్బరేలిలో జరిగిన ప్రచార సభల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓ గందరగోళ పార్టీ అని, యూపీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఓటమి ఖాయమని అన్నారు. ఏబీజీ గ్రూప్ ఇటీవల బ్యాంకులకు రుణాల ఎగవేత ఉదంతాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వం సంపన్నుల కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. పేదలకు రుణాలు దొరకడం కష్టమవుతుంటే బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులను లూటీ చేసి పారిపోతున్నారని అఖిలేష్ పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్పై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. బీజేపీ నేతల కుటుంబాల గురించి తాను ఒక్క మాట కూడా మాట్లాడనని, ఈ ఎన్నికలు నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై జరుగుతున్నాయని చెప్పారు. బ్యాంకులను లూటీ చేసి పారిపోతున్న పారిశ్రామికవేత్తలకు ఎవరితో సంబంధాలున్నాయో దేశమంతటికీ తెలుసునని అఖిలేష్ అన్నారు.
ఇలాంటి పారిశ్రామికవేత్తను కృతజ్జ్ఞతతో ఓ బీజేపీ ఎంపీ కలవడాన్ని తాను చూశానని. ఆయన పాక్ ప్రధాని పాదాలను తాకుతున్నట్టు తనకు అనిపించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్ పేలుళ్లకు సమాజ్వాదీ పార్టీకి సంబంధం ఉందని, దోషి తండ్రి ఎస్పీ కార్యకర్త అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహ కాషాయ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను అఖిలేష్ తోసిపుచ్చారు. దీనిపై తాను ఎందుకు వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేపట్టాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు ఓట్ల రూపంలో బీజేపీకి షాక్ ఇస్తుండటంతో ముందుముందు కూడా వారి నుంచి ఇలాంటి ప్రకటనలు చాలా వినాల్సి ఉంటుందని అఖిలేష్ అన్నారు. మరోవైపు రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ, యోగి సర్కార్లు ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కాషాయ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
యూపీ ప్రజల మధ్య విభేదాలు, చీలిక తేవడం మినహా వారు ఒరగబెట్టింది లేదని దుయ్యబట్టారు. సోమవారం ఓ ఆన్లైన్ కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ యూపీలో రైతులు కష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నా వారికి ఎరువులు రాయితీపై అందడం లేదని, నీటిపారుదల సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు యోగి సర్కార్ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవడం లేదని, పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఆరోపించారు.కాగా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తొంది. మరోవైపు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.