Ajit Pawar- Supriya Sule | మహారాష్ట్రలో పవార్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
తన తండ్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వయస్సుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తనయ, ఎంపీ సుప్రియా సూలే ఘాటుగానే రియాక్టయ్యారు. ‘అజిత్ దాదా (సోదరుడు)కు 65 ఏండ్లు. ఆయన ఇప్పుడు సీనియర్ సిటిజన్’ అని పేర్కొంటూ పరోక్షంగా అజిత్ పవార్ రిటైర్ కావాలని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరెత్తకుండానే ‘కొంత మంది 80 ఏండ్లు దాటినా రిటైర్ కావడానికి సిద్ధంగా లేరు’ అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వోద్యోగులు 58 ఏండ్లకే రిటైరవుతారు. సాధారణంగా అత్యధికులు 75 ఏండ్ల వయస్సు దాటే వరకూ తమ ప్రొఫెషనల్ లైఫ్ నుంచి తప్పుకుంటారు. కొందరు 60, 65, 70 ఏండ్లకు రిటైర్ అవుతారు. కానీ ఈ మనిషి (శరద్ పవార్) 80 ఏండ్లు దాటినా రిటైర్ కావడం లేదు. ఆయన వయస్సు 84 ఏండ్లు. ఏం జరుగుతున్నది’ అని ఠాణే జిల్లాలోని కల్యాణ్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అజిత్ పవార్ అన్నారు.
శరద్ పవార్ వర్గంలో కొనసాగుతున్న రోహిత్ పవార్ వ్యాఖ్యలపైనా అజిత్ పవార్ రియాక్టయ్యారు. ‘ఆయన పిల్లవాడు. విమర్శలు చేసేంత సీనియర్ కాదు. అతడి వ్యాఖ్యలపై నేను స్పందించడానికి టైం రావాలి. ఆయన విమర్శలకు మా పార్టీ అధికార ప్రతినిధి స్పందిస్తారు’ అని కొట్టిపారేశారు. ఎమ్మెల్యే రోహిత్ పవార్పైనా అజిత్ వ్యాఖ్యలను సుప్రియా సూలే కొట్టి పారేశారు. తన మేనల్లుడు (రోహిత్) గురించి ఏదైనా మాట్లాడాల్సిందన్నారు.