Maharashtra | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు గత కొన్నిరోజులుగా చకచకా మారిపోతున్నాయి. శివసేన అధినేత, ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి సీఎం గద్దె ఎక్కిన ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనున్నదని, ఈ మేరకు సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్నదనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు కమలం పార్టీ ఈసారి ఎన్సీపీకి గాలం వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే చర్చలు జరిపిన బీజేపీ.. అజిత్ పవార్ను సీఎంగా చేసి, ప్రభుత్వం కొనసాగేలా దాదాపు రంగం సిద్ధం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తాజా రాజకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.
మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన జపాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని ముంబై బయలుదేరారు. పుణెలో మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ముఖ్యనేత అజిత్ పవార్ రద్దు చేసుకొని పార్టీ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రలో 15 రోజులలో రెండు విస్ఫోటాలు జరుగబోతున్నాయని ఆ పార్టీ ఎంపీ సుప్రియా సులే సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలన్నీ సీఎం షిండే మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనున్నదనే ప్రచారమే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు కారణం. అనర్హత వేటు పడితే శివసేన-బీజేపీ ప్రభుత్వం కుప్పకూలకుండా బీజేపీ నాయకత్వం ఇటీవల ఎన్సీపీ అగ్రనేతలతో మంతనాలు జరిపినట్టు రెండు పార్టీల్లో ప్రచారం జరుగుతున్నది. బీజేపీ-ఎన్సీపీల మధ్య ఒప్పందం ప్రకారం ఎన్సీపీ-శివసేన (షిండే వర్గం)-బీజేపీ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. షిండే స్థానంలో ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ను సీఎం సీట్లో కూర్చొబెట్టే విధంగా ఒప్పందం కుదిరినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు ఎన్సీపీ అధినేత శరద్పవార్ కూడా సుముఖంగా ఉన్నప్పటికీ బయటికి మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినడం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
త్వరలో ఢిల్లీ, మహారాష్ట్రలో రెండు విస్ఫోటనాలు జరుగబోతున్నాయని ఎన్సీపీ అధినేత శరద్పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్టు పరోక్షంగా ఆమె సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో జరిగే విస్ఫోటనం.. సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. మహారాష్ట్రలో జరిగే విస్ఫోటనం.. సీఎం పీఠాన్ని అజిత్ పవార్ అధిరోహించడంగా సుప్రియా వ్యాఖ్యలను విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు అర్థం ఏమిటని సుప్రియాను మీడియా మంగళవారం ప్రశ్నించగా.. ‘దాదా కో పూచో’(నాన్నను అడగండి) అని సమాధానం దాటవేశారు.
కాంగ్రెస్, శివసేన(ఠాక్రే వర్గం)తో కొనసాగిన ఎంవీఏ కూటమికి స్వస్తి పలికి బీజేపీతో ఎన్సీపీ చేతులు కలపడం వెనుక బలమైన కారణం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు కుంభకోణంలో ఈడీ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు లేకపోవడమే కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ప్రఫుల్ పటేల్ తదితర ఎన్సీపీ నేతలంతా ఏదో ఒక ఈడీ, సీబీఐ, ఐటీ కేసులను ఎదుర్కొంటున్న వారే. కేంద్రంలో అధికారంలో కొనసాగుత్ను బీజేపీతో చేతులు కలిపితే కేసుల నుంచి విముక్తి పొందినట్టేనని వారు భావిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా 40 మంది అజిత్ పవార్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు ఆ పార్టీ ముఖ్యనేత ధనుంజయ్ ముండే మంగళవారం వెల్లడించారు. తామంతా అజిత్ పవార్ వెంటే ఉన్నామని చెప్పారు. తమ నిర్ణయానికి శరద్ పవార్ మద్దతు ఉంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేయడం గమనార్హం.