Ajit Doval : భారత్ – చైనా (India – China) దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది అక్టోబర్లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన తొలగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, దీనివల్ల రెండు దేశాలూ ప్రయోజనం పొందాయని దోవల్ పేర్కొన్నారు.
సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మంగళవారం అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 24వ విడత చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలోని టియాన్జిన్లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
ఆ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని దోవల్ ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని అజిత్ దోవల్ తెలిపారు. ‘సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి. శాంతి, సామరస్యం నెలకొన్నాయి. మన ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఎంతో లబ్ధి పొందాయి’ అని దోవల్ చెప్పారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రెండు దేశాల సంబంధాల్లో ఎదురైన ఆటుపోట్లు ఎవరికీ మంచివి కావని అన్నారు. గత ఏడాది మోదీ, జిన్పింగ్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేసిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని తెలిపారు. ‘సరిహద్దుల్లో ఇప్పుడు నెలకొన్న స్థిరత్వం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రధాని మోదీ మా ఆహ్వానం మేరకు ఎస్సీఓ సదస్సు కోసం చైనాకు రానుండటాన్ని మేం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
కాగా 2020 ఏప్రిల్-మే నెలల్లో లఢక్లోని వాస్తవాధీన రేఖ వద్ద మొదలైన సైనిక ప్రతిష్టంభన, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2024 అక్టోబర్ 21న ప్రతిష్టంభనకు తెరపడటంతో ఆ తర్వాత రెండు రోజులకే మోదీ-జిన్పింగ్ కజాన్లో సమావేశమై సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించారు. తాజా చర్చల్లో సరిహద్దుల్లో నమ్మకాన్ని పెంచే చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ఆఖరులో వాంగ్ యీ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు.