AIUDF : లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే తాము కాషాయ కూటమితో చేతులు కలపబోమని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గురువారం స్పష్టం చేశారు. తాము పోటీ చేసే మూడు స్ధానాల్లో ఏఐయూడీఎఫ్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎన్డీయే కూటమిలో చేరి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోమని, తాము లౌకిక పార్టీలతోనే కొనసాగుతామని బద్రుద్దీన్ అజ్మల్ తేల్చిచెప్పారు. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష పార్టీల కుమ్ములాట బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ఆప్, టీఎంసీ వంటి పెద్ద పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీ, బిహార్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ఆయన అంచనా వేశారు. పాలక పార్టీ ఈడీ, సీబీఐలతో విపక్షాలను వెంటాడినా రాజకీయ వాతావరణం బీజేపీకి వ్యతిరేకంగా ఉందని అన్నారు.
తమ బ్యాంకు ఖాతాల్లో కాషాయ పాలకులు రూ. 15 లక్షలు వేస్తారని ఊహించిన ప్రజలకు నిరాశ ఎదురైందని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు వారు 400కు పైగా స్ధానాలను కోరుకుంటున్నారని, వారి కల ఎన్నడూ నెరవేరబోదని వ్యాఖ్యానించారు. ఇక అసోంలో 14 లోక్సభ స్ధానాలకు ఏప్రిల్ 19, 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.
Read More :