Air Pollution | దేశ రాజధానిలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులో గాలి నాణ్యత సూచి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఆదివారం ఢిల్లీలోని డీటీయూలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 414 వద్ద నమోదుకావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. ముండ్కాలో ఇండెక్స్ 395కి చేరింది. శనివారంతో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా నమోదైంది.
ఎన్ఎస్ఐటీ ద్వారకలో 317, వజీర్పూర్లో 310, ఆనంద్ విహార్లో 335 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగింది. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GREP) మొదటి దశ అమలు ఉండగా.. వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి మరింత దిగజారితే రెండో దశలో నియామాలను అమలు చేసే అవకాశం ఉన్నది. అయితే, వరుసగా నాలుగోరోజు గాణి నాణ్యత సూచి పేలవ కేటగిరిలో ఉన్నది. ఉదయం 11 గంటలకు ఏక్యూఐ 228 ఉండగా.. మధ్యాహ్నం 3 గంటలకు ఇండెక్స్ 231 వద్ద ఉన్నది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం.. వాయువ్యం నుంచి తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. గంటకు 8-12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆదివారం ఎన్సీఆర్లో ఫరీదాబాద్లోని సూచీలు పడిపోయాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 270 వద్ద నమోదైంది. గ్రేటర్ నోయిడాలో 260, నోయిడాలో 200, గురుగ్రామ్లో 174గా ఉన్నది. అయితే, దీపావళి పండుగకు ముందే వాయు కాలుష్యం పెరగ్గా.. రాబోయే రోజులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.