Air India flight : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గం మధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీకే రప్పించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ జిల్లాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు, అక్కడ భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కీలక ప్రభుత్వ భవనాలు ఉన్న పాశ్చర్ స్ట్రీట్ సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు కనిపించాయి.
అయితే ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. యుద్ధ వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో గగనతలాన్ని పాక్షికంగా మూసివేయడంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కజకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని బాకుకు మళ్లించారు. షార్జా-మాస్కో విమానాన్ని పాకిస్థాన్ గగనతలం మీదుగా దారి మళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సిరియా మీదుగా ప్రయాణించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు.
ప్రజలను ఇళ్ల నుంచే పని చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది. జెనీవాలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.