Air India | ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుకు గానూ, క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. విమానంలో ఆల్కహాల్ సర్వీస్, సంఘటనల మేనేజ్మెంట్, బోర్డులో ఫిర్యాదుల నిర్వాహణ, నమోదుతోపాటు సిబ్బంది వల్ల ఇతర లోపాలు ఉన్నాయా అనే దానిపై అంతర్గత దర్యాప్తులు వంటి అంశాలపై ఎయిర్లైన్ సమీక్ష చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఒక పైలట్, నలుగురు సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. వారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతోపాటు విధులకు దూరంగా ఉంచి గ్రౌండ్ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న మిగతా సిబ్బందిపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.