న్యూఢిల్లీ : అహ్మదాబాద్లో నిరుడు జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించ లేదని, ఉద్దేశపూర్వక చర్య ఫలితమేనని తేల్చినట్లు ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొన్నది. భారత్, అమెరికా అధికారుల మధ్య ఇటీవల జరిగిన చర్చలతో ప్రమేయమున్న వర్గాలను ఉటంకిస్తూ పత్రిక పేర్కొన్నది. పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు, ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా ఇటాలియన్ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. కాగా, పౌర విమానయాన శాఖ తన తుది నివేదికను విడుదల చేయాల్సి ఉంది. దర్యాప్తునకు సహకరిస్తున్న అమెరికన్ నిపుణులు ఈ ఫలితాలను ఓ ముందడుగుగా అభివర్ణించారని పత్రిక పేర్కొన్నది.
ఉద్దేశపూర్వక చర్య ఫలితంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు ఇటలీ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) గురువారం కొట్టివేసింది. ఈ ఆరోపణలను అసత్యం, ఊహాజనితంగా బ్యూరో అభివర్ణించింది.