రాజ్కోట్: దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్లైట్ను టేకాఫ్ చేయనని పైలట్ మొండికేయడంతో ముగ్గురు ఎంపీలు సహా వంద మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజ్కోట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో ఆపరేషనల్ ఇష్యూ కారణంగా విమానం బయలుదేరాల్సిన సమయానికి బయలుదేరలేదు. ఇష్యూ పరిష్కారమైన తర్వాత పైలట్ తాను ఫ్లైట్ను టేకాఫ్ చేయనని మొండికేశాడు. తన డ్యూటీ టైమ్ ముగిసిందని, డీజీసీఏ నిబంధనల ప్రకారం పరిమిత వేళలకు మించి విమానం నడపకూడదని చెప్పాడు. దాంతో ఆ ఫ్లైట్లో వెళ్లాల్సిన ముగ్గురు ఎంపీలు (రాజ్కోట్ ఎంపీ మోహన్ కుందరియా, జామ్నగర్ ఎంపీ పూనమ్ మాదమ్, రాజ్యసభ ఎంపీ కేసరీదేవ్ సిన్హ్ ఝాలా) సహా 100 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా..
కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఎయిరిండియా (Air India) వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపరేషనల్ కారణాల వల్ల విమానం ఆలస్యమైందని తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్యూటీ సమయ పరిమితులను దాటి విధులు నిర్వహించరాదని, అందుకే పైలట్ ఫ్లైట్ను టేకాఫ్ చేసేందుకు నిరాకరించారని వెల్లడించింది. అత్యవసరంగా గమ్యస్థానాలు చేరాల్సిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, మిగిలిన వారికి హోటల్లో వసతి సదుపాయాలు కల్పించామని, ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్మును వాపస్ తీసుకునే వీలు కల్పించామని’ తన ప్రకటనలో పేర్కొన్నది. జరిగిన అసౌకర్యానికి ప్రయాణికులు క్షమించాలని కోరింది.