ముంబై: విమానంలో సాంకేతిక లోపంతో రెండు రోజుల పాటు రష్యాలో చిక్కుకుపోయిన 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఎట్టకేలకు గురువారం సురక్షితంగా శాన్ఫ్రాన్సిస్కోలో దిగారు. టికెట్ చార్జీలను వాపసు ఇవ్వడంతో పాటు వోచర్లు అందజేస్తున్నట్టు ఎయిర్ఇండియా ప్రకటించింది.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిర్ ఇండియా నాన్స్టాప్ విమానం ఏ1-173 మంగళవారం ఉదయం 4.23 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఇది మరునాడు ఉదయం 7 గంటలకు శాన్ఫ్రాన్సిస్కో చేరాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విమానానికి చెందిన ఒక ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలోని మగదన్ అనే చిన్న పట్టణంలో అత్యవసరంగా దించారు. దీంతో ప్రయాణికులు స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో తలదాచుకుని చాలా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ముంబై నుంచి మరో విమానం మగదన్ వెళ్లి అక్కడ రెండు రోజుల పాటు చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకుని గురువారం సాయంత్రం 6.14 గంటలకు అమెరికా చేరుకుంది.